తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవకపోతే కార్యకర్తలను బతకనివ్వరు: బండి సంజయ్

  • కరీంనగర్ లో సోషల్ మీడియా వాలంటీర్లతో బండి సంజయ్ సమావేశం
  • పేదలు-హిందుత్వం అనేదే తన పంథా అని స్పష్టీకరణ
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడి
  • బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుతున్నారని విమర్శలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలు-హిందుత్వం అనేదే తన పంథా అని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రాకపోతే తమ కార్యకర్తలను బతకనివ్వరని ఆందోళన వెలిబుచ్చారు. ఇక, ప్రజల్లో కాంగ్రెస్ గురించి చర్చే లేదని తేలిగ్గా తీసిపారేశారు. 

అయితే, బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. "నాపై అవినీతి ఆరోపణలు చేసి పార్టీని దెబ్బతీసే కుట్ర చేశారు. నా నిజాయతీ, నిబద్ధతను కాపాడుతోంది సోషల్ మీడియానే. మీడియా సంస్థలు కేసీఆర్ గుప్పిట్లో ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి బీజేపీ వార్తలు రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా జనంలోకి వెళదాం" అంటూ పిలుపునిచ్చారు.

Bandi Sanjay
Social Media
Volunteers
BJP
Karimnagar
KCR
BRS
Telangana

More Telugu News